ధోనీ, రోహిత్ లు చెప్పినట్టు జరగలేదు: విరాట్ కోహ్లీ

  • నిన్న నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో క్రికెట్
  • చివరి ఓవర్ వరకూ విజయం దోబూచులాట
  • ఆఖరి ఓవర్ ను అద్భుతంగా వేసిన విజయ్ శంకర్
నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది గానీ, చివర్లో స్టోయినిస్ ఎంత టెన్షన్ పెట్టాడో!... ఈ మ్యాచ్ లో 45వ ఓవర్ నుంచి గెలుపుపై కన్నేసిన స్టోయినిస్, ఆఖరి ఓవర్ వరకూ నిలిచాడు కూడా. చివరి ఓవర్ లో 11 పరుగులు మాత్రమే చేయాల్సిన స్థితిలో రెండు భారీ షాట్లను కొడితే సరిపోతుందన్న భావనలో ఉన్న అతన్ని, విజయ్ శంకర్ ఎల్బీగా పెవీలియన్ కు పంపాడు. దీంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది.

అంతకుముందు మైదానంలో జరిగిన ఓ ఆసక్తికర ఘటనను గురించి మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియాకు చెప్పాడు. తాను 46వ ఓవర్ ను శంకర్ తో వేయించాలని భావించానని, అయితే, మహమ్మద్ షమీ, బుమ్రాలు వరుసగా నాలుగు ఓవర్లు వేసేసి, మిగిలిన వికెట్లన్నీ తీస్తారని తనకు ధోనీ, రోహిత్ లు చెప్పారని అన్నాడు. వారిచ్చిన సలహాను తాను పాటించానని, అయితే, అది జరగలేదని అన్నాడు. చివరకు విజయం తమనే వరించడం ఆనందంగా ఉందని, విజయ్ శంకర్ రోజురోజుకూ తనను తాను మెరుగుపరుచుకుంటున్నాడని అన్నాడు.
Go Back to Shorts
Vijayshankar
Virat Kohli
Cricket
India
Australia

More Telugu News